Umpire Confusion: ఫీల్డ్‌ అంపైర్‌ను డైలమాలో పడేసిన ధోని.. వీడియో వైరల్‌

13 May, 2022 08:17 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆటగాళ్ల కంటే అంపైర్లే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఫీల్డ్‌ అంపైర్స్‌ నుంచి థర్డ్‌ అంపైర్‌ వరకు చూసుకుంటే తమ తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లను బలిచేశారు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌ శర్మ ఔట్‌ విషయంలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా మాత్రం ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ సిగ్నల్‌ ఇవ్వడంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. గురువారం ముంబై  ఇండియన్స్‌​, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఆరో ఓవర్‌ సమర్‌జిత్‌ సింగ్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఒక బంతిని సమర్‌జిత్‌ బ్యూటిఫుల్‌ ఇన్‌స్వింగర్‌ వేయగా.. ముంబై  ఇండియన్స్‌ బ్యాటర్‌ ఎడ్జ్‌ను దాటుతూ కీపర్‌ ధోని చేతుల్లో పడింది. అయితే బ్యాట్‌కు తాకిన శబ్ధం వినిపించడంతో ధోని అప్పీల్‌ చేశాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ కాస్త డైలమాలో పడి మొదట వైడ్‌ అనుకొని వైడ్‌ సిగ్నల్‌ ఇవ్వబోతూ వెంటనే యాంగిల్‌ మార్చి ఔట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది.కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోని (33 బంతుల్లో 36 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడగా, మిగతావారంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డానియెల్‌ స్యామ్స్‌ (3/16) చెన్నైని దెబ్బ తీయగా... కార్తికేయ, మెరిడిత్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (32 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు), టిమ్‌ డేవిడ్‌ (7 బంతుల్లో 16 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు.

చదవండి: IPL 2022: స్టేడియంలో పవర్‌ కట్‌.. నో రివ్యూ.. పాపం కాన్వే..!

మరిన్ని వార్తలు