IPL 2022: అంపైర్‌ పొరపాటు ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసొచ్చింది

15 Apr, 2022 22:34 IST|Sakshi

క్రికెట్‌లో ఫీల్డ్‌ అంపైర్‌పై ఒత్తిడి చాలానే ఉంటుంది. ప్రతీ బంతిని సూక్ష్మంగా పరిశీలించడం.. నో బాల్స్‌, వైడ్స్‌, లెగ్‌ బై, రనౌట్లు, ఫోర్లు, సిక్సర్లు, మైదానంలో ఆటగాళ్లను కంట్రోల్‌ చేయడం.. ఇలా ఒకటేంటి చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. ఇంత ఒత్తిలోనూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. దీంతో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. తాజాగా ఐపీఎల్‌ 2022లోనూ అలాంటిదే ఒకటి జరిగింది.

ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో అంపైర్‌ ఒక నో బాల్‌ను గుర్తించలేకపోయాడు. విషయంలోకి వెళితే.. టి20 క్రికెట్‌లో తొలి పవర్‌ ప్లే(6 ఓవర్లు) ముగిసిన తర్వాత ఔట్‌ ఫీల్డ్‌లో నలుగురు ఫీల్డర్లను ఉంచాలి. మిగతా ఫీల్డర్లు 30 గజాల సర్కిల్లో ఉండాలి. ఇది రూల్‌.. అయితే మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ తొలి బంతి వేసే సమయానికి ఉమ్రాన్‌ మాలిక్‌ ఔట్‌ ఫీల్డ్‌లో ఐదో ఫీల్డర్‌గా ఉన్నాడు. అప్పటికే బంతి వేయడం..బ్యాట్స్‌మన్‌ పరుగు తీయడం జరిగిపోయింది.

ఈ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సైమన్‌ డౌల్‌ ఎయిర్‌లో నోబాల్‌ అని చెప్పడం క్లియర్‌గా వినిపించింది. అంపైర్‌ చూసుంటే కచ్చితంగా నో బాల్‌ వచ్చేదే. అయితే ఔట్‌ఫీల్డ్‌లో ఎంతమంది ఉన్నారన్న విషయం అంపైర్‌ పట్టించుకోలేదు. మొత్తానికి అంపైర్‌ పొరపాటుతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒక నోబాల్‌ కలిసొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

>
మరిన్ని వార్తలు