MS Dhoni: ఆరోజే ధోని ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌?! స్టోక్స్‌తో పాటు కెప్టెన్సీ రేసులో వారిద్దరి పేర్లు

18 Feb, 2023 17:00 IST|Sakshi
ధోనిని హత్తుకున్న జడేజా (ఫైల్‌ ఫొటో)

IPL 2023- MS Dhoni: మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌! ధోని ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌కు తేదీ దాదాపు ఫిక్స్‌ అయిపోయినట్లే! అయితే, అందుకు వేదిక చెన్నై లేదంటే మరెక్కడనైనా అన్న విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఏడాది తలా చివరి ఐపీఎల్‌ ఆడబోతున్నాడన్న వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఐపీఎల్‌-2023లోనే చివరిసారిగా ధోనిని మైదానంలో చూసే అవకాశం ఉందని సదరు అధికారి పేర్కొన్నారు.

మాకు సాడ్‌ న్యూస్‌
‘‘అవును.. ఆటగాడిగా ఎంఎస్‌కు ఇదే ఆఖరి ఐపీఎల్‌. ఇప్పటివరకైతే మాకు తెలిసిన సమాచారం ఇదే. ఇది పూర్తిగా ధోని సొంత నిర్ణయం. అయితే, ఇప్పటివరకైతే అధికారికంగా మేనేజ్‌మెంట్‌తో తన రిటైర్మెంట్‌ గురించి ధోని చర్చించలేదు. 

ఏదేమైనా చెన్నైలో మ్యాచ్‌లు జరుగనుండటంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కానీ.. ధోని ఫైనల్‌ సీజన్‌ ఇదే కావడం వారితో పాటు మా అందరికీ విచారకర విషయం’’ అని ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో ఆ ఆధికారి వ్యాఖ్యానించారు. 

ఆరోజు ఫైనల్‌
క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌-2023 ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ జరుగనుంది. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే తొలి పోరుతో ఐపీఎల్‌–16 ప్రారంభం కానుంది. ఇక ఫైనల్‌ మే 28న జరుగనుంది.

కేకేఆర్‌ లేదంటే..
ఈ నేపథ్యంలో ఒకవేళ చెన్నై మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌ చేరితో ధోనికి అదే ఆఖరి మ్యాచ్‌ అవుతుంది. ప్లే ఆఫ్స్‌ కూడా చేరనట్లయితే.. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో మే 14న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడే మ్యాచ్‌ చివరిది కానుంది. 

తదుపరి కెప్టెన్‌?
చెన్నైని నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని వారసుడిగా ఎవరు వస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించగా అతడు మధ్యలోనే వదిలేయడంతో.. ధోనినే మళ్లీ కెప్టెన్సీ చేపట్టాడు.

స్టోక్స్‌తో పాటు వారిద్దరి పేర్లు
అయితే, ఈసారి వేలంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను కొనుగోలు చేసిన సీఎస్‌కే ధోని తర్వాత అతడిని కెప్టెన్‌ను చేసే అవకాశం ఉంది. అయితే, కెప్టెన్సీ రేసులో టీమిండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, వెటరన్‌ ప్లేయర్‌ అజింక్య రహానే పేర్లు కూడా వినిపించడం విశేషం.

దేశీ క్రికెటర్ల చేతికి సీఎస్‌కే పగ్గాలు అప్పగించాలనుకుంటే వీరు మంచి ఆప్షన్‌ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రహానేకు టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా, తాత్కాలిక కెప్టెన్‌గా అనుభవం ఉండగా.. రుతు దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర సారథిగా ఉన్నాడు.

చదవండి: IND vs AUS: చెత్త అంపైరింగ్‌.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్‌.. నో అంటున్నా..
IND VS AUS 2nd Test Day 2: అశ్విన్‌ ఖాతాలో అరుదైన రికార్డు

మరిన్ని వార్తలు