IPL 2023 GT Vs CSK: అహ్మదాబాద్‌లో భారీ వర్షం.. మ్యాచ్‌ జరుగుతుందా?

31 Mar, 2023 12:38 IST|Sakshi

శుక్రవారం ఐపీఎల్‌ 16వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పటికే సిద్ధమైంది. ఇక సీజన్‌ తొలి మ్యాచ్‌ డిపెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, సీఎస్‌కేల మధ్య జరగనుంది. అయితే అభిమానులకు ఒక బ్యాడ్‌న్యూస్‌. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో సీజన్‌లో తొలి మ్యాచ్‌ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.  

అహ్మదాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. అసలు ఊహించని రీతిలో హఠాత్తుగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో చెన్నై, గుజరాత్ టీమ్స్ ప్రాక్టీస్ సెషన్ లను రద్దు చేశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది నిరాశ కలిగించే అంశం. మ్యాచ్ సమయానికి కూడా ఇలాగే వర్షం పడితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. 

అయితే శుక్రవారం ఉదయం నుంచి అహ్మదాబాద్‌లో వర్షం పడలేదు. పైగా ఎండ బాగానే కాస్తోంది.  అయితే శుక్రవారం వర్షం పడే అవకాశాలు అసలు లేవని.. ఒకవేళ ఉన్నా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని రోజులుగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఊహించని రీతిలో సడెన్ గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రానికి కల్లా పరిస్థితి ఇలాగే ఉంటే మ్యాచ్ సజావుగా జరుగుతుంది. 

ఇక ప్రారంభవేడుకలను ఐపీఎల్‌ నిర్వాహకులు ఘనంగా నిర్వహించనున్నారు. టాలీవుడ్‌ హీరోయిన్స్‌ రష్మిక మందన్నా, తమన్నా భాటియా, సింగర్ అరిజిత్ సింగ్ తమ ప్రదర్శనతో అలరించనున్నారు. అయితే తొలి మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అందుబాటులో ఉండేది అనుమానంగా ఉంది. అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ ధోని ఆడకపోతే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చూడాలి.

స్టోక్స్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు. మరోవైపు ఛాంపియన్స్‌ హోదాలో బరిలోకి దిగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ సీఎస్‌కేపై నెగ్గి తమ ఆధిపత్యం చూపించాలని ఉవ్విళ్లూరుతుంది. గత సీజన్‌లో గుజరాత్‌తో తలపడిన రెండు సందర్భాల్లోనూ సీఎస్‌కేకు ఓటమే ఎదురయ్యింది.

చదవండి: IPL 2023: హోంగ్రౌండ్‌లో ఢిల్లీ ఆడే మ్యాచ్‌లకు పంత్‌!

IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. 

మరిన్ని వార్తలు