IPL 2023: రిటైర్మెంట్‌ ప్రకటించినా ముంబైతోనే.. కీలక బాధ్యతలు అప్పజెప్పిన యాజమాన్యం

16 Nov, 2022 08:00 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (189) ఆడిన విదేశీ ఆటగాడిగా, ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో ఒకే జట్టుకు (ముంబై ఇండియన్స్‌) ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో ఒకడిగా, 13 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌లో భాగమై, ఆ జట్టు 5 ఐపీఎల్‌ టైటిల్స్, 2 ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్స్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడిగా పలు అరుదైన ఘనతలు సాధించిన కీరన్‌ పొలార్డ్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు నిన్న (నవంబర్‌ 15) ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఆటగాడిగా రిటైర్మెంట్‌ ప్రకటించిన పోలార్డ్‌ సేవలను ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం వేరే రూపంలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. పోలార్డ్‌ ఎంఐకి చేసిన సేవలను గుర్తిస్తూ.. అతన్ని ఫ్రాంచైజీ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకొవాలని డిసైడ్‌ అయ్యింది. ఇందుకు పోలీ కూడా అంగీకారం తెలిపాడు. దీంతో అతను వచ్చే సీజన్‌ నుంచి ముంబై ఇండియన్స్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ మరో ఫ్రాంచైజీ అయిన ముంబై ఎమిరేట్స్‌లో ఆటగాడిగా కొనసాగుతానని పోలీ ప్రకటించాడు. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తంలో 189 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్‌.. 147.3 స్ట్రయిక్‌ రేట్‌తో 3412 పరుగులు చేశాడు. ఇందులో 16 అర్ధశతాకలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లో 8.79 ఎకానమీతో 69 వికెట్లు పడగొట్టాడు. పోలార్డ్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో రికార్డు స్థాయిలో 218 ఫోర్లు, 223 సిక్సర్లు బాదాడు. 
చదవండి: 13 మంది ఆట‌గాళ్ల‌ను వ‌దులుకున్న ముంబై ఇండియ‌న్స్..

మరిన్ని వార్తలు