IPL 2023: ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన ధోని.. వీడియో వైరల్‌

14 Oct, 2022 18:56 IST|Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఐపీఎల్‌-2023 కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాడు. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌ నెట్స్‌లో ధోని చెమటోడ్చుతున్నాడు. కాగా జార్ఖండ్‌ ఆటగాళ్లతో కలిసి ధోని నెట్‌ ప్రాక్టీస్‌ చేశాడు. దాదాపు రెండు గంటల కంటె ఎక్కువ సమయం ధోని నెట్స్‌లో గడిపాడు.

జార్ఖండ్ క్రికెట్‌ జట్టు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే జార్ఖండ్‌ జట్టు తమ సొంత మైదానంలో ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ధోని కూడా వాళ్లతో జతకలిశాడు. కాగా ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ధోని పర్వాలేదనపించాడు.

ఐపీఎల్‌-15వ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన మిస్టర్‌ కూల్‌.. 232 పరుగులు సాధించాడు. కాగా గతేడాది సీజన్‌లో తొలుత సీఎస్‌కే కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడి తట్టుకోలేక జడేజా.. తిరిగి జట్టు పగ్గాలు ధోనికే అప్పగించేశాడు.

కాగా ఐపీఎల్‌-2022లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించిన చెన్నై.. పాయింట్ల పట్టికలో 9 స్థానానికి పరిమితమైంది. ఇక ధోని సారథ్యంలో సీఎస్‌కే ఇప్పటి వరకు 4 సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది.


చదవండి: ENG vs AUS: వర్షం కారణంగా మూడో టీ20 రద్దు.. సిరీస్‌ ఇంగ్లండ్‌ సొంతం

మరిన్ని వార్తలు