Joe Root: కసిగా ఉన్నట్లున్నాడు.. కెమెరాలు బద్దలైపోతున్నాయి

28 Mar, 2023 10:04 IST|Sakshi

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జో రూట్‌ మంచి కసి మీద ఉన్నట్లున్నాడు. తన తొలి ఐపీఎల్‌ ఆడడం కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న రూట్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో రూట్‌ తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రూట్‌ ఒక్కసారి కూడా ఐపీఎల్‌లో పాల్గొనలేదు.

కనీస ధర రూ. కోటికే రాజస్తాన్‌కు అమ్ముడుపోయిన రూట్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  ఇప్పటివరకు 32 టి20లు ఆడిన రూట్‌ 126 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. అత్యు‍త్తమ స్కోరు 90గా ఉంది.ఇటీవలే అబుదాబి వేదికగా జరిగిన ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20లో రూట్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్‌ చేసి టి20 క్రికెటర్‌గా తాను పనికివస్తానని చెప్పకనే చెప్పాడు.

ఇక ప్రాక్టీస్‌లో భాగంగా రూట్‌ కొట్టిన బంతి కెమెరాను బ్రేక్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్‌ తన సిగ్నేచర్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడగా.. బంతి నేరుగా కెమెరాను తాకడంతో అది ముక్కలయింది. ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేసుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌.. ''26.03.2023.. రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున జో రూట్‌ ఫస్ట్‌బాల్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ గతేడాది ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జాస్‌ బట్లర్‌(863 పరుగులు) తన కెరీర్‌లోనే సూపర్‌ఫామ్‌ కనబరచడంతో సంజూ శాంసన్‌ నేతృత్వంలోని రాజస్తాన్‌ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఖంగుతిని రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

చదవండి: బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ!

Lionel Messi: 'వొడువని ముచ్చట'.. అరుదైన గౌరవం

మరిన్ని వార్తలు