షెడ్యూల్‌ ఖరారు చేసేందుకు...

29 Jul, 2020 03:33 IST|Sakshi

వచ్చేనెల 2న ఐపీఎల్‌ పాలక మండలి భేటీ 

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 13వ సీజన్‌కు తుది మెరుగులు ఇచ్చేందుకు లీగ్‌ పాలక మండలి వచ్చేనెల ఆగస్టు 2న సమావేశం కానుంది. కరోనా విలయంతో ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్న భారత ప్రేక్షకులు మెరుపుల లీగ్‌ కోసం ఎన్నడూ లేనంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూఏఈలో జరుగనున్న ఈ టోర్నీ మొదలైతే టీవీలకే అతుక్కుపోవడం ఖాయం. ఇదివరకే సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు ఈవెంట్‌ నిర్వహిస్తామని లీగ్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఆయనే పాలక మండలి సమావేశంపై మీడియాకు తెలిపారు. 2న జరిగే మీటింగ్‌లో లీగ్‌పై తుదిరూపు ఖరారవుతుందని, ఎనిమిది ఫ్రాంచైజీలకు పూర్తి స్పష్టత వస్తుందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

మరిన్ని వార్తలు