సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం : బ్రిజేష్‌

24 Jul, 2020 12:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్‌ ప్రియులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌-2020) నిర్వహణకు సంబంధించి చైర్మన్‌ బ్రిజేష్‌ పాటిల్‌ పలు కీలక విషయాలను వెల్లడించారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 8 టీంలు లీగ్‌ బరిలో నిలుస్తాయని, నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ‘కరేబియన్‌​లీగ్‌ సెప్టెంబర్‌ 10 ముగుస్తుంది. అలాగే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ అదే నెల 15న ముగియనుంది. ఈ మూడు దేశాల ఆటగాళ్లు వెసులుబాటుకు దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’ అని పాటిల్‌ తెలిపారు. దీనిపై బీసీసీఐ గవర్నర్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మొత్తం 51 రోజుల పాటు లీగ్‌ను నిర్వహించే విధంగా షెడ్యూల్‌ను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం బ్రిజేష్‌ పాటిల్‌ మీడియాతో మాట్లాడారు. (చలో దుబాయ్@ ఐపీఎల్‌-2020)

కాగా టీ-20 ప్రపంచ్‌ కప్‌ వాయిదా పడటంతో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో విదేశాల్లో లీగ్‌ను నిర్వహించాలని భావించింది. దీనిలో భాగంగానే లీగ్‌ నిర్వహణకు యూఏఈ అనువైన ప్రదేశంగా గుర్తించింది. కాగా కరోనా విజృంభణ కారణంగా ఆస్ట్రేలియా వేదికగా సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కావాల్సిన టీ-20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించకపోతే రూ. 4వేల కోట్ల వరకు నష్టం చవిచూడాల్సి వస్తుందని లెక్కలేసిన బీసీసీఐ.. ఐసీసీ నిర్ణయంతో ఆ సమయంలో లీగ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. (ఐపీఎల్‌పై కేంద్రానికి లేఖ రాసిన బీసీసీఐ)

>
మరిన్ని వార్తలు