T20 World Cup: అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్‌ సెలెక్టర్‌

9 Sep, 2021 16:24 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌లో రాణించడంతో పాటు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కిందని భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపాడు. సుందర్ గాయపడటంతో ఆఫ్ స్పిన్నర్ కొరత ఏర్పడిందని, దాంతో అశ్విన్‌ను తీసుకోవడం అనివార్యమైందని  పేర్కొన్నాడు. అశ్విన్‌ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమని తెలిపిన చేతన్‌ శర్మ.. అతను జట్టుకు పెద్ద ఆస్తి అని పేర్కొన్నాడు. 

కాగా, అశ్విన్‌ 2017 జూలైలో వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గత నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో అతని నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టీ20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. గతేడాది ఐపీఎల్‌లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసిన యాష్‌.. ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది తొలిదశ ఐపీఎల్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడిన యాష్‌.. కరోనా నేపథ్యంలో కుటుంబంతో కలిసుండాలని లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు అశ్విన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ప్రస్తుత సీజన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు సాధించింది. 

ఇదిలా ఉంటే, అక్టోబర్‌ 17న ప్రారంభమయ్యే ఈ మెగాటోర్నీ కోసం భారత సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా ఎంపిక కాగా, రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2007లో కెప్టెన్‌గా జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్‌ అందించిన ధోనిని ఈ ప్రపంచకప్‌లో టీమిండియా మెంటర్‌గా బీసీసీఐ నియమించింది. 

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ

స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌
చదవండి: అదే జరిగితే చారిత్రక సిరీస్‌ రద్దు.. తాలిబన్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా బెదిరింపులు

మరిన్ని వార్తలు