IPL 2022: KL Rahul- Rashid Khan: కేఎల్‌ రాహుల్‌, రషీద్‌ ఖాన్‌పై ఏడాది పాటు నిషేధం!?

1 Dec, 2021 11:56 IST|Sakshi
PC: IPL

IPL 2022 Retention KL Rahul Rashid Khan Could Banned Lucknow Approach Reports: ఐపీఎల్‌-2022 సీజన్‌లో టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ నిషేధం ఎదుర్కోబోతున్నారా? 15వ సీజన్‌కు వీరిద్దరు దూరం కానున్నారా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. తాము ఇప్పటి వరకు ప్రాతినిథ్యం వహించిన పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల ఫిర్యాదు మేరకు బీసీసీఐ తీసుకునే చర్యలపై వీరి ఐపీఎల్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొంటున్నాయి. 

ఇంతకీ ఏం జరిగిందంటే... ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో నవంబరు 30న 8 ఫ్రాంఛైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌తో కలిసి కొనసాగడానికి ఇష్టపడకపోగా.. రషీద్‌ ఖాన్‌ తన కోసం 16 కోట్లు వెచ్చిస్తేనే(మొదటి రిటెన్షన్‌) జట్టులో ఉంటానని పేర్కొన్నట్లు సమాచారం. 

కానీ, సన్‌రైజర్స్‌ మాత్రం కేన్‌ విలియమ్సన్‌ వైపు మొగ్గు చూపగా రషీద్‌తో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త ఫ్రాంఛైజీ లక్నో రాహుల్‌, రషీద్‌తో సంప్రదింపులు జరిపి... భారీ మొత్తం ఆఫర్‌ చేయడంతో వీరిద్దరు తమ జట్లను వీడేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పంజాబ్‌, హైదరాబాద్‌.. లక్నో ఫ్రాంఛైజీపై ఫిర్యాదు చేసినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ కథనం ప్రచురించింది. 

బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారని, మౌఖికంగా తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాహుల్‌కు 20 కోట్లు, రషీద్‌కు 16 కోట్లు ముట్టజెప్పేందుకు లక్నో అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే రాహుల్‌, రషీద్‌ నిబంధనలకు విరుద్ధంగా కొత్త ఫ్రాంఛైజీతో ఒప్పందాలు చేసుకున్నట్లయితే వారిపై వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఏడాది పాటు క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు దూరం కావాల్సి ఉంటుంది. అయితే, బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే వీరి భవితవ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

చదవండి: IPL 2022 Retention- Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే!

మరిన్ని వార్తలు