Irani Cup 2022: కెప్టెన్‌గా హనుమ విహారి.. జట్టులో ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు

28 Sep, 2022 15:40 IST|Sakshi

Irani Cup 2022- Rest of India (RoI) squad: భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు టెస్టు మ్యాచ్‌ జరుగనుంది. ఇందులో భాగంగా 2019- 20 రంజీ ట్రోఫీ చాంపియన్స్‌ సౌరాష్ట్ర, రెస్టాఫ్‌ ఇండియా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

కెప్టెన్‌గా విహారి
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి బుధవారం రెస్టాఫ్‌ ఇండియా జట్టును ప్రకటించింది. సౌరాష్ట్రతో పోటీపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో తెలుగు ఆటగాడు శ్రీకర్‌ భరత్‌కు కూడా జట్టులో చోటు దక్కింది.

ఉమ్రాన్‌ మాలిక్‌ సైతం
ఇక ఇటీవల ముగిసిన దులీప్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్‌జోన్‌ జట్టులో భాగమైన ప్రియాంక్‌ పాంచల్‌, ద్విశతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్‌, యశ్‌ దుల్‌ తదితరులు రెస్టాఫ్‌ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను సైతం ఈ టీమ్‌కు ఎంపిక చేశారు.

కాగా రంజీ ట్రోఫీ విజేతకు.. వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్‌ ఇండియాకు మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఇరానీ కప్‌ ట్రోఫీ అందుకుంటుంది. అయితే, కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించలేదు.

రెస్టాఫ్‌ ఇండియా జట్టు:
హనుమ విహారి(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ప్రియాంక్‌ పాంచల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, యశ్‌ ధుల్‌, సర్పరాజ్‌ ఖాన్‌, యశస్వి జైశ్వాల్‌, కేఎస్‌ భరత్‌, ఉపేంద్ర యాదవ్‌, జయంత్‌ యాదవ్‌, సౌరభ్‌ కుమార్‌, ఆర్‌ సాయికిషోర్‌, ముకేశ్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ సేన్‌, అర్జాన్‌ నాగ్వస్వల్లా.

చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్‌
ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో..

మరిన్ని వార్తలు