Ishan Kishan: 'ఔట్‌ కాకపోయుంటే ట్రిపుల్‌ సెంచరీ బాదేవాడిని'

10 Dec, 2022 20:50 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్  డబుల్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇషాన్‌  కిషన్.. 131 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.  డబుల్ సెంచరీ చేసే క్రమంలో ఇషాన్.. 24 బౌండరీలు, 10 సిక్సర్లు బాదాడు. 

ఇక విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 290 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.  85 బంతుల్లో సెంచరీ చేసిన  ఇషాన్.. 126 బంతుల్లోనే  డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా  భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్,  రోహిత్ శర్మల సరసన నిలిచాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ అనంతరం ఇషాన్ కిషన్‌ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తున్నది. నేను బ్యాటింగ్ కు వెళ్లగానే అనుకున్నది ఒక్కటే.  బంతి  బాదడానికి అనువుగా ఉంటే బాదేయడమే. అందులో మరో ఆలోచనే లేదు. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ  చేయడం ద్వారా  నా పేరు దిగ్గజాల సరసన  ఉండటం  నన్ను నేనే నమ్మలేకపోతున్నా. నేను ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసి ఉంటే ట్రిపుల్ సెంచరీ కూడా సాధించేవాడినేమో. విరాట్ భయ్యాతో  బ్యాటింగ్ చేయడం బాగుంటుంది. 

నేను 90లలో ఉన్నప్పుడు దూకుడుగా ఆడుతుంటే  నా దగ్గరికి వచ్చి ముందు సింగిల్స్ తీయమని చెప్పాడు. నేను దానినే ఫాలో అయ్యాను. వాస్తవానికి నేను సిక్సర్ తో సెంచరీ చేద్దామనుకున్నా. సూర్య భాయ్ (సూర్యకుమార్ యాదవ్)తో కూడా చాట్ చేశాను.  బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను ఒత్తిడి తీసుకోదలుచుకోలేదు. నాకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా'' అని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు