కపిల్‌దేవ్‌ తర్వాత ఇషాంత్‌ శర్మదే ఆ రికార్డు

21 Feb, 2021 19:07 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ ముంగిట అరుదైన రికార్డు ఉంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న పింక్‌బాల్‌ టెస్టు ఇషాంత్‌కు వందో టెస్టు కావడం విశేషం. కాగా టీమిండియా తరపున ఈ ఫీట్‌ సాధించిన రెండో ఫాస్ట్‌ బౌలర్‌గా అతను‌ చరిత్ర సృష్టించనున్నాడు. ఇంతకముందు టీమిండియా నుంచి 100 టెస్టులు ఆడిన ఒకే ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా కపిల్‌దేవ్‌ ఉన్నాడు. ఇషాంత్‌ కన్నా ముందు జహీర్‌ ఖాన్‌ 92 టెస్టులు, జగవల్‌ శ్రీనాథ్‌ 67 టెస్టు మ్యాచ్‌లు ఆడారు.

2007 లో టెస్ట్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఇశాంత్ శర్మ 99వ టెస్టులోనే 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఇషాంత్‌ ఇప్పటివరకు టీమిండియా తరపున 99 టెస్టుల్లో 302 వికెట్లు, 80 వన్డేల్లో 112 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌పై అత్యధికంగా 61 వికెట్లు పడగొట్టగా.. ఆస్ట్రేలియాపై 59 వికెట్లు తీశాడు. ఒక ఏడాదిలో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో ఇషాంత్‌కు 2011, 2018 బాగా కలిసివచ్చాయి. 2011 లో 12 టెస్టుల్లో 43 వికెట్లు, 2018 లో 11 మ్యాచ్‌లాడి 41 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇషాంత్ ఇప్పటివరకు ఆడిన 99 టెస్టుల్లో 45 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించడం విశేషం.
చదవండి: అశ్విన్‌‌ అవసరం తీరిపోయింది.. కమ్‌బ్యాక్‌ కష్టమే
ఆ బెయిల్‌ ఎలా కిందపడింది : ఇషాంత్‌

>
మరిన్ని వార్తలు