ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ

12 Oct, 2020 20:00 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌, ఢిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా టోర్నీ నుంచి వైదొలగగా,  తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ లీగ్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో కేవలం ఒక  గేమ్‌ మాత్రమే ఆడిన ఇషాంత్‌.. గాయం కారణంగా ఇంటిముఖం పట్టాడు. అతని పక్కటెముకలు గాయం వేధిస్తుండటంతో టోర్నీకి దూరమవుతున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ తెలిపింది. ఈ నెల 7వ తేదీన ట్రైనింగ్‌ సెషన్‌లో ఇషాంత్‌ ఎడమవైపు పక్కటెముకలు నొప్పి ఎక్కువైంది. (ఫస్ట్‌ ఓవర్‌లోనే ఫైనల్‌ స్కోరు.. ఫిక్సింగ్‌ కాదా?)

దీనికి కొన్ని వారాలు విశ్రాంతి అనివార్యం కావడంతో ఇషాంత్‌ టోర్నీని వదిలి వెళ్లక తప్పడం లేదు. ‘ ఇషాంత్‌ గాయం దురదృష్టకరం. ఈ ఐపీఎల్‌ సీజన్‌కు ఇషాంత్‌ దూరం కానున్నాడు. ఢిల్లీ ఫ్రాంచైజీలోని ప్రతీ ఒక్కరూ ఇషాంత్‌ తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని సదరు ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని రోజుల క్రితం లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇషాంత్‌ శర్మ దూరం కావడం ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బ. ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్ల అనుభవాన్ని ఢిల్లీ కోల్పోనుంది. మరొకవైపు రిషభ్‌ పంత్‌ కూడా గాయం కారణంగా వారం రోజుల పాటు జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. వచ్చే బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఏడు మ్యాచ్‌లకు గాను ఐదు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. నిన్న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ కోల్పోయింది. (సునీల్‌ నరైన్‌ ఔట్‌)

>
మరిన్ని వార్తలు