‘అర్జున’తో ఆనందంగా ఉన్నా 

30 Aug, 2020 08:31 IST|Sakshi

భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ 

దుబాయ్‌: శరీరం సహకరించినంత కాలం క్రికెట్‌ ఆడతానని అర్జున అవార్డు విజేత, భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కోసం దుబాయ్‌ వెళ్లిన ఇషాంత్‌ శనివారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకకు హాజరు కాలేకపోయాడు. అయినప్పటికీ ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ అభినందనలు తెలిపాడు. ‘చిన్న వయస్సులోనే క్రికెట్‌పై నాకున్న ఇష్టాన్ని తెలుసుకున్నా. నాటి నుంచి ఇప్పటివరకు ప్రతీ మ్యాచ్‌లోనూ 100 శాతం ప్రదర్శన కనబరిచా. 13 ఏళ్ల తర్వాత లభించిన ఈ అర్జున అవార్డు మరింత రాణించేందుకు కావాల్సిన స్ఫూర్తినిచ్చింది. (చదవండి : చెన్నై ‘హైరానా’ )

ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు. నా ప్రయాణంలో వెన్నంటే నిలిచిన బీసీసీఐకి ధన్యవాదాలు. ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ అభినందనలు’ అని ఇషాంత్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. 31 ఏళ్ల ఇషాంత్‌ భారత్‌ తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది ఇషాంత్, మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ అర్జునకు ఎంపిక కాగా....రోహిత్‌ శర్మ ‘ఖేల్‌రత్న’కు ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు