Jason Roy On PSL Experience: అదో భయానక పరిస్థితి.. పాకిస్థాన్‌ లీగ్‌ అనుభవాలను ఉద్దేశించి ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

21 Jun, 2022 16:37 IST|Sakshi

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) అనుభవాలను ఉద్దేశించి ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జేసన్‌ రాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పీఎస్‌ఎల్‌ ఆడే రోజుల్లో భయానక పరిస్థితులను ఎదుర్కొన్నానని, పాక్‌లో ఉన్నన్ని రోజుల మానసికంగా చాలా సమస్యలతో బాధపడ్డానని, ఆ రోజులు తన జీవితంలో చీకటి రోజులని చెప్పుకొచ్చాడు. నెదర్లాండ్స్‌తో రెండో వన్డే ముగిసిన అనంతరం రాయ్‌ ఈ మేరకు తన పీఎస్‌ఎల్‌ అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. 

ఐపీఎల్‌కి ముందు జరిగిన పీఎస్‌ఎల్ (2022 సీజన్‌)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఆడిన జేసన్ రాయ్.. ఆ సీజన్‌లో అంచనాలకు తగ్గట్టుగానే రాణించినా మానసిక ప్రశాంతతను పొందలేకపోయానని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. క్రికెట్‌ను ఎక్కడున్నా ఆస్వాదించే నేను పీఎస్‌ఎల్‌లో ఆడినన్ని ఎంజాయ్‌ చేయలేకపోయానని తెలిపాడు. కారణం తెలీదు కానీ పాక్‌లో ఉన్నన్ని రోజులు నరకంలో ఉన్నట్టే అనిపించిందని వాపోయాడు. అక్కడి అనుభవాల కారణంగానే ఐపీఎల్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నాడు.

కాగా, ఐపీఎల్‌ 2022 సీజన్‌ మెగా వేలంలో జేసన్‌ రాయ్‌ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే లీగ్‌ ప్రారంభానికి ముందే అతను బయో బబుల్‌ను సాకుగా చూపి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇదిలా ఉం‍టే, నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలో రాయ్‌ 60 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 73 పరుగులు చేసి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 
చదవండి: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్‌ క్రికెటర్‌

మరిన్ని వార్తలు