KL Rahul Covid-19 Positive: విండీస్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియాకు బిగ్‌ షాక్‌?

21 Jul, 2022 21:54 IST|Sakshi

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలేలా ఉంది. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయంతో వన్డేలకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌లకు వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్‌, జడేజాలు కెప్టెన్‌, వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో జడేజా మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు.

తాజాగా విండీస్‌తో సిరీస్‌కు ముందు జడేజాకు మోకాలి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో జడ్డూను ఒక మ్యాచ్‌కే దూరం పెట్టాలా లేక మొత్తం వన్డే సిరీస్‌ నుంచి తప్పించాలా అనేది బీసీసీఐ యోచిస్తుంది. అయితే ఆ తర్వాత జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు జడేజా అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ఆశిస్తోంది. జూలై 22,24, 27 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.

కేఎల్‌ రాహుల్‌కు కరోనా పాజిటివ్‌..

ఇక కేఎల్‌ రాహుల్‌ కూడా విండీస్‌తో టి20 సిరీస్‌ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రీహాబిటేషన్‌లో భాగంగా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో ఉన్న కేఎల్‌ రాహుల్‌ గురువారం మరోసారి కరోనా బారిన పడ్డాడు. కరోనా నుంచి కోలుకున్నప్పటికి కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తేనే విండీస్‌తో టి20 సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వాస్తవానికి విండీస్‌తో టి20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు చోటు దక్కించుకున్నప్పటికి ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. ఇక కుల్దీప్‌ యాదవ్‌కు శుక్రవారం ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించనున్నారు.

జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఐదు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే టి20 సిరీస్‌ ప్రారంభానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉండడం.. ఈలోగా రాహుల్‌ కోవిడ్‌ నుంచి కోలుకుంటే ఫిట్‌నెస్‌ నిరూపించుకొని విండీస్‌తో టి20 సిరీస్‌లో ఆడేందుకు అవకాశముందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు.

విండీస్‌తో టీమిండియా వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్.

విండీస్‌తో టీమిండియా టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్. అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌*, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్.

చదవండి: IND Vs WI: విండీస్‌తో వన్డే సిరీస్‌.. అరుదైన రికార్డులపై కన్నేసిన ధావన్‌

పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా?

>
మరిన్ని వార్తలు