ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌

21 Nov, 2022 13:37 IST|Sakshi

తమిళనాడు స్టార్‌ ఆటగాడు నారాయణ్ జగదీశన్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో నారాయణ్‌ ఏకంగా డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇది ఈ టోర్నీలో అతడికి వరుసగా ఐదో సెంచరీ. తద్వారా జగదీశన్ ప్రపంచరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు  2014-15 సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఈ రికార్డు ఉంది. తాజా మ్యాచ్‌లో సెంచరీ సాధించిన జగదీశన్ సంగక్కర రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 141 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. 15 సిక్స్‌లు, 25 ఫోర్లతో 277 పరుగులు చేశాడు.

రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు
లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగా జగదీశన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లీష్‌ క్రికెటర్‌ అలిస్టర్ బ్రౌన్(268) పేరిట ఉండేది. అదే విధంగా భారత్‌ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రోహిత్‌ శర్మ(264) రికార్డును జగదీశన్ బ్రేక్‌ చేశాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్‌ శర్మ 264 పరుగులు సాధించాడు.

తమిళనాడు స్కోర్‌ ఎంతంటే?
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. జగదీశన్‌తో పాటు మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్(154) పరుగులతో రాణించాడు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌ అంటే?
అంతర్జాతీయ వన్డేలతో పాటు దీశీవాళీ వన్డేటోర్నీలు కూడా లిస్ట్‌-ఏ క్రికెట్‌ పరిగణలోకి వస్తాయి. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఓవర్ల సంఖ్య నలభై నుంచి అరవై వరకు ఉంటుంది. అదే విధంగా అధికారిక వన్డే హోదాను సాధించని దేశాలు పాల్గొనే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లిస్ట్‌-ఏ క్రికెట్‌ పరిగణలోకి వస్తాయి.
చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్‌!

మరిన్ని వార్తలు