పిచ్చి ప్రశ్న.. జట్టులోనే లేను.. నేనెలా తీస్తాను 

20 May, 2021 21:45 IST|Sakshi

లండన్‌: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ భలే సరదాగా ఉంటాడు. అది ఆన్‌ఫీల్డ్‌.. ఆఫ్‌ఫీల్డ్‌ ఏదైనా కావొచ్చు.. తన చర్యలతో అభిమానుల మనుసులు గెలుచుకుంటాడు. ఇక సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండే నీషమ్‌ ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు గమ్మత్తైన సమాధానాలు ఇస్తూ ఆకట్టుకుంటాడు. తాజాగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచటెస్టు చాంపిన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న కివీస్‌ ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను కూడా ఆరంభించారు.

ఈ సందర్భంగా జేమ్స్‌ నీషమ్‌ను ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు వినూత్న రీతిలో సమాధానం ఇచ్చాడు. టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో రోహిత్‌ శర్మ లేదా విరాట్‌ కోహ్లిలలో ఎవరి వికెట్‌ తీస్తాననుకుంటున్నావు అంటూ ఒక అభిమాని ప్రశ్న వేశాడు. దీనికి నీషమ్‌ ఒక నిమిషం కూడా ఆలోచించికుండా అదేం ప్రశ్న.. అసలు నేను జట్టులోనే లేను.. ఇక వికెట్‌ ఎలా తీస్తాను.. ఒకవేళ అవకాశం వచ్చినా వికెట్‌ తీసే అవకాశాలు చాలా తక్కువ అంటూ ఫన్నీ సమాధానమిచ్చాడు. ఇక నీషమ్‌ ఇచ్చిన సమధానం వైరల్‌గా మారింది.

వాస్తవానికి నీషమ్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడడం లేదు. అతను కివీస్‌ తరపున టెస్టు మ్యాచ్‌ ఆడి నాలుగు సంవత్సరాలైంది. 2014లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన నీషమ్‌ 12 టెస్టులు మాత్రమే ఆడాడు. ఈ 12 టెస్టుల్లో 709 పరుగులు చేసిన నీషమ్‌ బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. నీషమ్‌ చివరిసారిగా 2017లో కివీస్‌ తరపున టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అలాగే  66 వన్డేలాడి 1320 పరుగులతో పాటు 68 వికెట్లు, 29 టీ20లు ఆడి 324 పరుగులు సాధించాడు. కాగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
చదవండి: క్రికెటర్‌ భువనేశ్వర్‌ ఇంట్లో విషాదం.. 

ఒక్క విజయం.. అంతే హోటల్‌ రూంకు వేగంగా పరిగెత్తా

>
మరిన్ని వార్తలు