Pak Vs Eng: మూడో వన్డేలోనూ పాక్‌ ఓటమి; సిరీస్‌ ఇంగ్లండ్‌ కైవసం

14 Jul, 2021 09:05 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ అద్భుత సెంచరీతో మెరిసినా జట్టుకు పరాభవం తప్పలేదు. వరుసగా మూడో వన్డేలోనూ ఓడిన పాక్‌ ఇంగ్లండ్‌కు సిరీస్‌ను అప్పగించింది. 3-0 తేడాతో సిరీస్‌ను ఇంగ్లండ్‌ వైట్‌వాష్‌ చేసేసింది. కాగా సిరీస్‌ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌ జట్టులో నలుగురు ఆటగాళ్లు కరోనా బారీన పడడంతో అప్పటికప్పుడు స్టోక్స్‌ను కెప్టెన్‌గా నియమించిన ఈసీబీ అందుబాటులో ఉన్న రెండో జట్టును ఆడించింది. ఇది మంచి అవకాశంగా భావించాల్సిన పాక్‌ వన్డే సిరీస్‌లో ఆధ్యంతం చెత్త ప్రదర్శనను నమోదు చేసి సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జేమ్స్‌ విన్స్‌(102, 95 బంతులు; 11 ఫోర్లు) మొయిడెన్‌ సెంచరీతో జట్టును గెలిపించగా.. చివర్లో లూయిస్‌ జార్జరీ 77 పరుగులుతో రాణించాడు. అంతకముందు పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. బాబర్‌ అజమ్‌(158,139 బంతులు; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్‌ ఇమామ్‌ హుల్‌ హక్‌ 56, కీపర్‌ రిజ్వాన్‌ 74 పరుగులు చేశారు. సెంచరీతో ఆకట్టుకున్న జేమ్స్‌ విన్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా, బౌలర్‌ సకీబ్‌ మహమూద్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచారు.

మరిన్ని వార్తలు