జపాన్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒలంపిక్స్ నిర్వాహకుల్లో ఆందోళన

2 Jul, 2021 21:45 IST|Sakshi

టోక్యో: జపాన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒలంపిక్స్ నిర్వహకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల నేపథ్యంలో అనేక దేశాల నుంచి వేల సంఖ్యలో క్రీడాకారులు నగరానికి చేరుకోనున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి మరింత వేగవంతంగా జరిగే ఆస్కారం ఉండడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. అవసరమైతే ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగా వెల్లడించారు. కాగా, గత నెలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పదివేల మంది ప్రేక్షకులకు అనుమతిస్తామని నిర్వహకులు తెలిపారు. 

అయితే, నాటి నుంచి కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. రోజుకి సగటున 500 వరకూ నమోదైన కేసులు.. గత రెండు రోజుల క్రితం నుంచి 1500 దాటుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 1821 కేసులు నమోదవగా.. ఇందులో టోక్యోలో నమోదైనవే 714 కేసులు కావడం ఆందోళన కలిగించే అంశం. దీంతో ఒలింపిక్స్ నిర్వహణ కత్తి మీద సాములా మారింది. మరోవైపు టోక్యోతో పాటు ఇతర ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపిస్తుండడంతో ప్రభుత్వం నివారణ చర్యల్లో నిమగ్నమైంది. 
 

మరిన్ని వార్తలు