కరోనా.. విరాళం అందించిన మరో ఆసీస్‌ క్రికెటర్‌

4 May, 2021 22:08 IST|Sakshi

ముంబై: భారత్‌లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్‌పై భారత్‌ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్‌ ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాట్‌ కమిన్స్‌, బ్రెట్‌ లీ, సచిన్‌, శిఖర్‌ ధావన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, రహానె, పాండ్యా బ్రదర్స్‌తోపాటు ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యాలు కూడా సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్ బ్రెండార్ఫ్‌ కరోనాతో పోరాడుతున్న భారత్‌కు యునిసెఫ్‌ ద్వారా తన వంతు సాయాన్ని అందించాడు.

'' యూనిసెఫ్ ద్వారా భారత్‌కు సాయం చేయనున్నా.. నేను చేసేది చిన్న సాయం కావొచ్చు.. కానీ ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా నమ్మకం. చాలా మంది ఆటగాళ్ల మాదిరిగానే నాకు భారత్‌ అంటే ప్రత్యేక అభిమానం. అయితే భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అది నన్ను ఆవేదనకు గురి చేస్తుంది.'' అంటూ చెప్పకొచ్చాడు. జోష్‌ హాజిల్‌వుడ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన  జేసన్ బ్రెండార్ఫ్‌ ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. అయితే అతను సీఎస్‌కే తరపున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. ఈలోగా ఐపీఎల్‌కు కరోనా సెగ తగలడంతో టోర్నీ రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
చదవండి: 'నాన్న తొందరగా వచ్చేయ్‌.. నిన్ను మిస్సవుతున్నాం'

వారిని చూస్తే బాధేస్తోంది.. కానీ ఏం చేయలేని పరిస్థితి

మరిన్ని వార్తలు