IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. బుమ్రా కీలక నిర్ణయం!

17 Jan, 2023 08:09 IST|Sakshi

భారత స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా భారత జట్టులోకి తిరిగి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొం‍దుతున్నాడు. కాగా బుమ్రా వెన్ను గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ అయితే సాధించలేదు. రాబోయో వారంలో బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నట్లు తెలుస్తోంది.

ఫిట్‌నెస్‌ టెస్టులో బుమ్రా ఉత్తీర్ణత సాధిస్తే.. అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టుకు ఎంపిక అయ్యే ఛాన్స్‌ ఉంది. కాగా ఆసీస్‌తో మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో మాత్రం బుమ్రాకు చోటు దక్కలేదు. అయితే ఆఖరి రెండు టెస్టులకు  ఈ స్పీడ్‌స్టార్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఈ క్రమంలో బుమ్రా తన ఫిట్‌నెస్‌ను నిరూపించేకునేందుకు ఆల్‌రౌండర్‌ రవీం‍ద్ర జడేజా బాటలోనే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో బుమ్రా ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా కూడా రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు.

బుమ్రా తన వెన్ను గాయం నుంచి బాగా కోలుకుంటున్నాడు. కానీ అతడు ఇంకా 100 శాతం ఫిట్‌నెస్‌ సాధించలేదు. అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి మరో 2 వారాల పునరావాసం అవసరం. అతడు ఫిట్‌నెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు తిరిగి జట్టులోకి వస్తాడు.

అయితే అతడు జట్టులో వచ్చేముందు దేశవాళీ క్రికెట్‌లో ఆడే అవకాశం ఉంది. అది సెలక్టర్లు, బమ్రా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని సీనియర్‌ బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా బుమ్రా గాయం కారణం‍గా ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs NZ: హైదరాబాద్‌ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్‌

>
మరిన్ని వార్తలు