IND VS SL ODI Series: టీమిండియాకు భారీ షాక్‌.. బుమ్రా ఔట్‌

9 Jan, 2023 13:59 IST|Sakshi

గౌహతి వేదికగా శ్రీలంకతో రేపటి (జనవరి 10) నుంచి ప్రారంభంకానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ బౌలర్‌, పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా జట్టులో చేరకుండానే ఔటయ్యాడు. వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా.. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేని కారణంగా జట్టు దూరంగా ఉండాలని సూచించినట్లు బీసీసీఐకి చెందిన కీలక ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

దీంతో బుమ్రా వన్డే జట్టుతో కలవకుండా ఎన్‌సీఏ (నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ)లోనే ఉండిపోయాడు. సహచరులు, టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటికే తొలి వన్డేకు వేదిక అయిన గౌహతికి చేరుకున్నారు.

కాగా, లంకతో వన్డే సిరీస్‌ నుంచి బుమ్రాను తప్పించడానికి వేరే కారణాలు ఉన్నట్లు ఎన్‌సీఏ అధికారుల ద్వారా తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. సమీప భవిష్యత్తులో కీలక సిరీస్‌లు (ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌, వన్డే వరల్డ్‌కప్‌) ఆడాల్సి ఉన్నందున మరోసారి గాయాల బారిన పడకుండా ఉండాలని బీసీసీఐ ఉద్దేశపూర్వకంగా అతన్ని తప్పించినట్లు తెలుస్తోంది.

లంకతో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో పేసర్‌ స్థానానికి ఎటూ పోటీ ఉన్నందున రిస్క్‌ తీసుకోవడం ఎందుకని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఒకవేళ ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముం‍దే బుమ్రాను బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో అతనికి అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది.

లంకతో వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ 

 
 

మరిన్ని వార్తలు