T20 WC 2022 Sqaud: టీమిండియాకు భారీ షాక్‌.. టీ20 ప్రపంచకప్‌కు కూడా అతడు దూరం!

11 Aug, 2022 16:47 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. బుమ్రా ప్రస్తుతం తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.

అంతకు మందు 2019లో బుమ్రా ఇదే గాయంతో బాధపడ్డాడు. దీంతో బుమ్రా గతంలో చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక ఇప్పడు అతడి గాయం మళ్లీ తిరగబెట్టింది. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌కు జట్టు ప్రకటించడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున బుమ్రా గాయం బీసీసీఐను ఆందోళనకు గురిచేస్తోంది.

"బుమ్రా గాయం మా జట్టును కలవరపెడుతోంది. అతడు ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి పాత గాయం మళ్లీ తిరిగి బెట్టింది. ప్రస్తుతం బుమ్రా వెన్ను నొప్పి తీవ్రమైంది.  ప్రపంచ కప్‌కు మాకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది.

ఈ సమయంలో బుమ్రా గాయపడడం మా దురదృష్టమనే చెప్పుకోవాలి. అతడు మా జట్టు ప్రాధాన బౌలర్‌. కాబట్టి అతడు గాయం నుంచి తొందరగా కోలుకుని తిరిగి జట్టులోకి చేరుతాడని ఆశిస్తున్నాము" అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌తో పేర్కొన్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది.
చదవండి: 'భవిష్యత్తులో అతడు టీమిండియా కెప్టెన్‌ కావడం ఖాయం'

మరిన్ని వార్తలు