ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షాను అంతర్జాతీయ క్రికెట్కు సంబంధించిన మరో పదవి వరించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా జై షా ఎంపికయ్యారు. నజ్ముల్ హసన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడైన 32 ఏళ్ల జై షా ఏసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన అతి పిన్న వయస్కుడు కావడం విశేషం. తాజా బాధ్యతల పట్ల సంతోషం వ్యక్తం చేసిన జై షా... ఆసియాలో మహిళల క్రికెట్, జూనియర్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా జై షాకు బోర్డు సహచరులు అభినందనలు తెలియజేశారు.