IND-W vs ENG-W: 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి..

24 Sep, 2022 20:32 IST|Sakshi

లార్డ్స్‌ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలో ఇంగ్లండ్‌ మహిళలతో భారత జట్టు తలపడుతోంది. కాగా భారత మహిళా జట్టు వెటరన్‌ పేసర్‌ జులాన్‌ గోస్వామి తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ క్రికెటర్ల నుంచి జులాన్‌ గోస్వామి 'గార్డ్ ఆఫ్ హానర్'  స్వీకరిచింది. భారత ఇన్నింగ్స్‌లో  గోస్వామి బ్యాటింగ్‌ సమయంలో ఇంగ్లండ్‌ క్రికెటర్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు.

దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. కాగా ఈ మ్యాచ్‌లో గోస్వామి తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో షేర్‌ చేసింది. "20 ఏళ్లుగా ఝులన్ గోస్వామి తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించింది.

ఆమె వన్డే క్రికెట్‌లో దాదాపు 10,000 బంతులు వేసింది. ఎంతో మంది యువ క్రికెటర్లు అత్యుత్తమంగా తాయారు చేయడంలో జులాన్‌ కీలక పాత్ర పోషించింది. జులాన్‌ ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శం" అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ ట్విటర్‌లో పేర్కొంది. కాగా 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్‌ 201 వన్డేల్లో 253 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. 
చదవండి: Womens T20 World Cup 2023: అర్హత సాధించిన ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌

మరిన్ని వార్తలు