టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

6 Mar, 2023 13:40 IST|Sakshi

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌ తగిలింది. వన్డే జట్టుకు ఎం‍పికైన స్టార్‌ బౌలర్‌ జై రిచర్డ్‌సన్‌.. హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజ్యూరీ (పిక్కకు సంబంధించిన గాయం) కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. రిచర్డ్‌సన్‌ స్థానాన్ని నాథన్‌ ఇల్లీస్‌ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ అస్ట్రేలియా ఇవాళ (మార్చి 6) అధికారికంగా ప్రకటించింది.

బిగ్‌బాష్‌  లీగ్‌ సందర్భంగా గాయపడిన రిచర్డ్‌సన్‌.. తాజాగా ఓ లోకల్‌ మ్యాచ్‌ అడుతుండగా మరోసారి గాయపడటంతో భారత్‌లో పర్యటించే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఒకవేళ రిచర్డ్‌సన్‌ గాయం తీవ్రత అధికంగా అతను ఐపీఎల్‌-2023 నుంచి కూడా నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో రిచర్డ్‌సన్‌ ముంబై ఇండియన్స్‌కు పాత్రినిధ్యం వహించాల్సి ఉంది.

మార్చి 17, 19, 22 తేదీల్లో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల ఆసీస్‌ బృందంలో రిచర్డ్‌సస్‌ ఉన్నాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఆసీస్‌-టీమిండియా వన్డే సిరీస్‌ ఆడనున్నాయి. మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది.

అనంతరం తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖలో, మూడో వన్డే చెన్నైలో జరుగుతుంది. కాగా, ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది.  

మరిన్ని వార్తలు