రూట్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. బిత్తరపోయిన రహానే

7 Feb, 2021 19:00 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ టీమిండియా పాలిట కొరకరాని కొయ్యగా మారాడు. ముందు బ్యాటింగ్‌లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన రూట్‌ తాజాగా ఫీల్డింగ్‌లోనూ ఇరగదీశాడు. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే ఇచ్చిన క్యాచ్‌ను రూట్‌ డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో అందుకోవడం హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. డోమ్‌ బెస్‌ ఆఫ్ స్టంప్‌కి వెలుపల వేసిన బంతిని రహానే కవర్స్ దిశగా హిట్ చేశాడు. కానీ అప్పటికే మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జో రూట్ రెప్పపాటులో ఎడమవైపు డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో రహానే కొన్ని సెకన్ల పాటు అలాగే బిత్తరపోయాడు. రూట్‌ అద్భుత క్యాచ్‌తో రహానే నిరాశగా పెవిలియన్‌‌ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.ప్ర‌స్తుతం క్రీజులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ (33), అశ్విన్ (8) ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత్‌ ఇంకా 321 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, పంత్‌లు 119 పరుగుల భాగస్వామ్యంతో కాస్త ఫుంజుకున్నట్లే కనిపించింది. అయితే మూడో సెషన్‌లో పుజారా, పంత్‌లు వెనువెంటనే ఔట్‌ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. టీమిండియా ఫాలోఆన్‌ గండం నుంచి బయటపడాలంటే మరో 200 పరుగులు చేయాల్సి ఉంది. అశ్విన్‌, సుందర్‌ల తర్వాత మిగిలినవారు టెయిలెండర్లు కావడంతో టీమిండియా ఫాలోఆన్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా అంతకుముందు పర్యటక ఇంగ్లాండ్‌ జట్టు 578 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆదివారం 555/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లీష్‌ జట్టు మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్‌లో రూట్‌ 218, సిబ్లీ 87, స్టోక్స్‌ 82 పరుగులు పోప్‌ 34, డొమినిక్‌ 34, బర్న్స్‌ 33, బట్లర్‌ 30 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌కు చెరో 3 వికెట్లు, ఇషాంత్, షాబాజ్‌ నదీమ్‌కు తలో 2 వికెట్లు దక్కాయి.

చదవండి: 
ముగిసిన మూడోరోజు ఆట.. ఫాలోఆన్‌ తప్పదా!
డబుల్‌ సెంచరీ.. ఆపై మ్యాచ్‌ను గెలిపించాడు

మరిన్ని వార్తలు