గావస్కర్‌ ‌.. ఫోన్‌ ఆన్‌లో ఉంది.. ఇప్పుడు మాట్లాడుదాం!

27 Mar, 2021 13:28 IST|Sakshi

పుణే: ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొదటి వన్డేలో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్న బెయిర్‌ స్టో రెండో వన్డేలో సెంచరీని మిస్‌ కాకుండా చూసుకున్నాడు. 112 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేసిన బెయిర్‌ స్టో.. స్టోక్స్‌( 99 పరుగులు)తో కలిసి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అయితే ఇదే బెయిర్‌ స్టో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో మూడు సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన బెయిర్‌ స్టోపై  లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌  విమర్శనాస్త్రాలు సంధించాడు. టెస్టు మ్యాచ్‌ ఆడే సమయంలో క్రీజులో ఉండడానికి బెయిర్‌ స్టో ఆసక్తి చూపించడం లేదని కామెంట్‌ చేశాడు. తాజాగా గావస్కర్‌  వ్యాఖ్యలపై బెయిర్‌ స్టో స్పందించాడు.

''నిజానికి గావస్కర్‌  నా పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలియదు. అప్పడే తెలిసి ఉంటే వెంటనే స్పందించేవాడిని. ఏదైతేనేం.. గావస్కర్‌  కావాలంటే నాకు ఫోన్‌ చేసి మాట్లాడొచ్చు. టెస్టు క్రికెట్‌లో కుదురుగా ఆడడానికి ఒక లెజెండరీ క్రికెటర్‌ ఇచ్చే విలువైన సలహాల కోసం ఎదరుచూస్తున్నా. అతను కోరుకుంటే నాకు కాల్‌ చేయొచ్చు లేదా ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపొచ్చు.. ఎందుకంటే నా ఫోన్‌ ఇప్పుడు ఆన్‌లో ఉంది. ''అంటూ చురకలంటించాడు.

ఇక​ మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... రిషభ్‌ పంత్‌ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్‌) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్‌ 43.3 ఓవర్లలో 4 వికెట్లకు 337 పరుగులు చేసి గెలిచింది. బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకం సాధించగా... స్టోక్స్‌ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు), జేసన్‌ రాయ్‌ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచారు. ఇరు జట్లకు కీలకమైన మూడో వన్డే రేపు(ఆదివారం) జరగనుంది.
చదవండి:
'అదంతా మిస్‌ కమ్యూనికేషన్‌‌‌ వల్ల జరిగింది'

రనౌట్‌ వివాదం.. స్టోక్స్‌ అవుటా.. కాదా?

మరిన్ని వార్తలు