-

Junior World Cup: మనోళ్ల గురి అదిరింది

14 May, 2022 05:51 IST|Sakshi

జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో ఉమామహేశ్, ఇషా సింగ్‌లకు స్వర్ణాలు

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ స్పోర్ట్స్‌: జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో శుక్రవారం టీమ్‌ ఈవెంట్స్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. జర్మనీలో  జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ యువ షూటర్‌ మద్దినేని ఉమామహేశ్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో... తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఫైనల్లో ఉమామహేశ్, పార్థ్, రుద్రాం„Š లతో కూడిన భారత జట్టు 16–8తో స్పెయిన్‌ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.

విజయవాడకు చెందిన 17 ఏళ్ల ఉమామహేశ్‌ కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఫైనల్లో ఇషా సింగ్, పలక్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 16–8తో జార్జియా జట్టుపై గెలిచింది.  మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఫైనల్లో రమిత, జీనా ఖిట్టా, ఆర్యా బోర్సెలతో కూడిన భారత జట్టు 17–9తో దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో సౌరభ్‌ చౌదరీ, శివ, సరబ్‌జీత్‌లతో కూడిన భారత జట్టు 17–9తో ఉజ్బెకిస్తాన్‌ జట్టుపై గెలిచి నాలుగో పసిడి పతకాన్ని అందించింది.

మరిన్ని వార్తలు