ఐపీఎల్‌లోకి రాయచోటి క్రికెటర్‌ ఎంట్రీ.. చెన్నై ట్వీట్‌

19 Feb, 2021 09:03 IST|Sakshi

సాక్షి, రాయచోటి(కడప): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడో యంగ్ క్రికెటర్. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్‌ రెడ్డి ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యాడు. 22 ఏళ్ల హరిశంకర్‌ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. 2021 ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా గురువారం నిర్వహించిన వేలంలో ఈ యువకుడిని రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. 

దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అరుదైన అవకాశం హరిశంకర్‌కి దక్కినట్టయింది. ఇక బాహుబలి వచ్చిన గడ్డ నుంచి హరిశంకర్‌ వచ్చాడని సీఎస్‌కే టీమ్ అభివర్ణించింది. ఈమేరకు సీఎస్‌కే యాజమాన్యం ట్వీట్ చేసింది. ఇది వరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే.

సుదీర్ఘ విరామం తరువాత కడప జిల్లా నుంచే మరో యంగ్ క్రికెటర్ హరిశంకర్‌ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. కాగా హరిశంకర్‌కు ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. రాయచోటి ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేయాలని ఆయన ఆకాక్షించారు.

చదవండి:  
కాసుల వర్షం .. 20 లక్షలు టూ కోట్లు
ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌కు కోట్లాభిషేకం
ఐపీఎల్‌ 2021 వేలం: ముంబైకి అర్జున్‌ టెండూల్కర్‌

మరిన్ని వార్తలు