విలియమ్సన్‌ 251

4 Dec, 2020 13:10 IST|Sakshi

హామిల్టన్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా తన మొదటి ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్‌ 519/7 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. 243/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో  రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌ మరో 276 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. న‍్యూజిలాండ్‌  తొలి ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు.  412 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్స్‌లతో 251 పరుగులు నమోదు చేశాడు. 97 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన విలియమ్సన్‌ అత్యంత నిలకడగా ఆడాడు. ఈ క్రమంలోనే తొలుత సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్‌.. ఆపై దాన్ని డబుల్‌ సెంచరీగా మలుచుకున్నాడు.

మూడు పెద్ద భాగస్వామ్యాలు నమోదు చేసిన విలియమ్సన్‌ ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై కాసేపటికి తన తొలి ఇన్నింగ్స్‌ను కివీస్‌ డిక్లేర్డ్‌ చేసింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో లాథమ్‌(86), జెమీసన్‌(51 నాటౌట్‌)లు హాఫ్‌ సెంచరీలు సాధించారు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌, గాబ్రియెల్‌లు తలో మూడు వికెట్లు సాధించారు. జోసెఫ్‌కు వికెట్‌ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 26 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(20 బ్యాటింగ్‌), జాన్‌ క్యాంప్‌బెల్‌(22 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు