ఇండియా టూర్‌కు కేన్‌ మామ డుమ్మా.. కారణం ఏంటంటే..?

19 Dec, 2022 18:31 IST|Sakshi

New Zealand Tour Of India 2023: వచ్చే ఏడాది (2023) జనవరిలో జరుగనున్న 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా జరుగనున్న వన్డే సిరీస్‌ కోసం జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు నిన్న (డిసెంబర్‌ 18) ప్రకటించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, స్టార్ పేసర్ టిమ్ సౌథీ, హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ లేకుండానే న్యూజిలాండ్‌ వన్డే జట్టు భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమైంది.

ఈ ముగ్గురూ భారత్ కంటే ముందు పాకిస్తాన్‌తో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (జనవరి 10, 12, 14) పాల్గొని అట్నుంచి అటే న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్లిపోతారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (సీఎన్‌జెడ్‌) వెల్లడించింది. ఫిబ్రవరిలో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ టీమ్‌ స్వదేశంలో పర్యటించనున్న నేపథ్యంలో వర్క్‌ లోడ్‌ తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎన్‌జెడ్‌ ప్రకటిం‍చింది. 

కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీలో భారత్‌తో వన్డే సిరీస్‌కు టామ్‌ లాథమ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొన్న సీఎన్‌జెడ్‌.. ఈ సిరీస్‌కు హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ స్థానంలో అసిస్టెంట్‌ కోచ్‌ లూక్‌ రాంచీ కోచింగ్‌ బాధ్యతలు చేపడతాడని తెలిపింది. విలియమ్సన్, సౌథీ స్థానాలను మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ భర్తీ చేస్తారని పేర్కొంది.

కాగా, భారత పర్యటనలో న్యూజిలాండ్ తొలుత వన్డే సిరీస్‌ ఆడనుంది. జనవరి 18, 21, 24 తేదీల్లో వన్డే సిరీస్‌ జరుగనుంది. అనంతరం జనవరి 27, 29 ఫిబ్రవరి 1 తేదీల్లో టీ20 సిరీస్‌ జరుగుతుంది. టీ20 సిరీస్‌కు జట్టును సీఎన్‌జెడ్‌ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

భారత్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు : 
టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫ్ఫీ, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి

మరిన్ని వార్తలు