'ఐపీఎల్‌ రద్దు అని తెలియగానే నా గుండె పగిలింది'

4 May, 2021 16:24 IST|Sakshi

లండన్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించగానే.. ''నా గుండె పగిలిందంటూ'' ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా సోమవారం కేకేఆర్‌ ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. సీఎస్‌కే జట్టులో సిబ్బందితో పాటు బౌలింగ్‌ కోచ్‌ బాలాజీకి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి అమిత్‌ మిశ్రాలు కరోనా బారీన పడడంతో బీసీసీఐ ఐపీఎల్‌ నిర్వహణపై పునరాలోచించింది. మొదట తాత్కాలికంగా వాయిదా వేయాలని భావించినా.. ఆటగాళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువే ఉండడంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లుగా మంగళవారం నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సోషల్‌ మీడియాలో వినూత్న రీతిలో కామెంట్లు వచ్చాయి.

ఈ విషయంపై పీటర్సన్‌ తన ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ' ఇండియాను ఇలా చూడడం బాధగా ఉంది. ప్రస్తుతం కరోనా విస్పోటనం ఆ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ సమయంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం నా గుండె పగిలేలా చేసింది. అయినా ఇలాంటి విపత్కర సమయంలో లీగ్‌ను రద్దు చేయడమే సరైన నిర్ణయం. బీసీసీఐని నేను స్వాగతిస్తున్నా. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతోపాటు కరోనాతో పోరాడుతున్న భారతదేశ ప్రజలను దృష్టిలో ఉంచుకొని పీటర్సన్‌ ఒక సందేశాన్ని ఇచ్చాడు. ''మీరు ఈ విపత్తు నుంచి బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దృడంగా ఉండాల్సిన సమయం ఇది.. ఇలాంటి సమయంలో మీరు ఆత్మనిర్భరంతో ఉంటూ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి'' అంటూ తెలిపాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన సీఎస్‌కే రెండో స్థానంలో ఉంది. 
చదవండి: IPL 2021 సీజన్‌ రద్దు: బీసీసీఐ

సందీప్‌ ఓకే.. కానీ వరుణ్‌ కోలుకోవాల్సి ఉంది

మరిన్ని వార్తలు