Kick Boxing: నిర్లక్ష్యం.. రింగ్‌లోనే కుప్పకూలిన కిక్‌ బాక్సర్‌

14 Jul, 2022 16:23 IST|Sakshi

కిక్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగానే ప్రత్యర్థి ఇచ్చిన పంచ్‌కు కిక్‌ బాక్సర్‌ రింగ్‌లోనే కుప్పకూలాడు. ఈ దురదృష్టకర ఘటన జూలై 10న బెంగళూరులో చోటుచేసుకుంది. కాగా యువ బాక్సర్‌ మృతికి మేనేజ్‌మెంట్‌ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు పేర్కొన్నారు.  మృతి చెందిన బాక్సర్‌ 23 ఏళ్ల నిఖిల్‌ అని తెలిపారు.

విషయంలోకి వెళితే..జూలై 10న బెంగళూరులోని జ్ఞానజ్యోతి నగర్‌లోని పై ఇంటర్నేషనల్‌ బిల్డింగ్‌లో స్టేట్‌ కిక్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ నిర్వహించారు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి మొహంపై పంచ్‌ ఇవ్వగానే వేగంగా కిందపడిన నిఖిల్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే అతన్ని నగరబావిలోని జీఎమ్‌ ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన నిఖిల్‌ తలలో ఇంటర్నల్‌ బ్లీడింగ్‌  జరగడంతో బుధవారం రాత్రి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

నిఖిల్‌ మృతిపై అతని తండ్రి సురేశ్‌ స్పందించాడు. ' పంచ్‌ దెబ్బకు నిఖిల్‌ తలలో బ్లీడింగ్‌ జరగలేదు. బాక్సింగ్‌ రింగ్‌పై ఉన్న మ్యాట్‌ నాసిరకం. మ్యాట్‌ కింద కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం.. మ్యాట్‌పై తల బలంగా తాకడంతోనే నిఖిల్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ కూడా చేయలేదని.. పారామెడికల్‌ యూనిట్‌ గాని.. నిఖిల్‌ను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్‌ కూడా అందుబాటులో లేకపోవడంతోనే నా కొడుకు మృతి చెందాడంటూ'' ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా మ్యాచ్‌ నిర్వహించిన ఈవెంట్‌ ఆర్గనైజర్‌ నవీన్‌ రవిశంకర్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తుందని.. అతను పరారీలో ఉన్నట్లు సురేశ్‌ పేర్కొన్నారు. నిఖిల్‌ తండ్రి ఫిర్యాదు మేరకు జ్ఞానభారతి పోలీసులు సెక్షన్‌ 304-ఏ కింద కేసు నమోదు చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు