ప్రిక్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్, సింధు

12 Jan, 2022 00:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో వీరిద్దరూ తొలి రౌండ్‌లో అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. టాప్‌ సీడ్‌ శ్రీకాంత్‌ 21–17, 21–10తో సిరిల్‌ వర్మ (భారత్‌)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సింధు 21–5, 21–16తో కుదరవల్లి శ్రీకృష్ణప్రియ (భారత్‌)పై గెలిచింది.

భారత్‌కే చెందిన అష్మిత చాలియా 24–22, 21–16తో ఐదో సీడ్‌ ఎవగెనియా కొసెత్‌స్కాయా (రష్యా)పై సంచలన విజయం సాధించింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో గాయత్రి గోపీచంద్‌–త్రిషా జాలీ (భారత్‌) జంట 21–12, 21–10తో ప్రొజొరోవా–రుదకోవా (ఉక్రెయిన్‌) జోడీపై నెగ్గి ముందంజ వేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో గాయత్రి గోపీచంద్‌–సాయిప్రతీక్‌ (భారత్‌) ద్వయం 21–16, 16–21, 21–17తో ఇషాన్‌ భట్నాగర్‌–తనీషా క్రాస్టో (భారత్‌) జోడీపై... సిక్కి రెడ్డి–ధ్రువ్‌ కపిల (భారత్‌) జంట 21–11, 21–11తో చిరాగ్‌ అరోరా–నిషు రాప్రియా (భారత్‌) ద్వయంపై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాయి. 

మరిన్ని వార్తలు