Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్‌-డి ప్లేయర్‌'.. టీమిండియా మాజీ క్రికెటర్‌

3 Jun, 2022 14:12 IST|Sakshi

ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే  ‘ఫోర్‌డీ ప్లేయర్’గా అభివర్ణించాడు. ''హార్దిక్‌ పాండ్యా ఇప్పుడు ఫోర్ డైమెన్షనల్ ప్లేయర్. ఇంతకుముందు అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేసేవాడు...ఇప్పుడు ఈ త్రీడీ ప్లేయర్‌కి కెప్టెన్సీ కూడా తోడైంది. కెప్టెన్సీ కూడా అదరగొడతానని నిరూపించుకున్నాడు. అతనిలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు...ఐపీఎల్ సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ ఆడిన విధానం అద్భుతం. హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా మారడం, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలవడం, వ్యక్తిగతంగానూ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడం... అంత తేలికైన విషయం కాదు'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఈ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా కెరీర్‌ మొదటి రోజుల్లో తన అకాడమీలో క్రికెట్‌ ఆడిన రోజులను కూడా కిరణ్‌ మోరే గుర్తుచేసుకున్నాడు  ''కృనాల్ పాండ్యా నా అకాడమీలో జాయిన్ అయ్యి, క్రికెటర్‌గా రాణించాలని శిక్షణ తీసుకుంటున్నాడు. హార్ధిక్ పాండ్యా, అన్న కోసం ఎప్పుడూ అక్కడికి వచ్చేవాడు...చిన్నతనంలోనే నెట్స్‌లో పరుగెడుతూ క్యాచ్‌లు అందుకునేవాడు. అప్పుడు కృనాల్‌కి తన తమ్ముడిని కూడా ప్రాక్టీస్‌కి తీసుకురమ్మని చెప్పాను. అతని కళ్లల్లో ఆటపై ఇష్టాన్ని అప్పుడే గమనించా... చిన్నప్పటి నుంచే అన్ని మ్యాచుల్లో అదరగొట్టాలనే తపన, తాపత్రయం హార్ధిక్ పాండ్యాలో కనిపించేవి'' అని పొగడ్తలతో ముంచెత్తాడు. 

ఇక త్రీడీ ప్లేయర్‌ అనే  మాట వినగానే గుర్తొచ్చేది విజయ్ శంకర్. 2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో లక్కీగా చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ గురించి అప్పటి ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన కామెంట్లపై అంబటి రాయుడు వేసిన ట్వీట్... చాలా పెద్ద దుమారమే రేపింది...బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ రాణించే విజయ్ శంకర్, జట్టుకి ‘త్రీడీ ప్లేయర్’గా ఉపయోగపడతాడని ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం... వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ చేశానంటూ’ అంబటి రాయుడు ట్వీట్ వేయడం... అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది.

చదవండి: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!

Rafael Nadal Unknown Facts: ఫుట్‌బాలర్‌ కావాల్సిన వ్యక్తి.. క్లేకోర్టు రారాజు ఎలా అయ్యాడు

మరిన్ని వార్తలు