అభిమానుల కోసం కేకేఆర్‌ సాంగ్‌‌ రిలీజ్‌

22 Mar, 2021 17:51 IST|Sakshi

కోల్‌కతా: త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ ఎడిషన్‌ కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఇదివరకే ప్రాక్టీస్‌ షురూ చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ మార్చి 31 నుండి ట్రైనింగ్‌ సెషన్‌ను ప్రారంభించనుంది. తాజాగా, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కూడా  త్వరలో ట్రైనింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది ఏడు రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టు తమ అభిమానుల కోసం స్పెషల్‌ ఐపీఎల్‌ క్వారంటైన్‌ సాంగ్‌ను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించగా.. వరుసగా రెండో సీజన్‌లోనూ అదే పరిస్థితి నెలకొనడంతో, కోల్‌కతా ఫ్రాంచైజీ యాజమాన్యం మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కోల్పోయిన తమ అభిమానులకు అంకితం చేస్తూ ఓ  పాటను రూపొందించింది. వీ విల్‌ మిస్‌ యూ అంటూ సాగే ఈ పాటను కేకేఆర్‌ తమ ట్విటర్‌ ఖాతా ద్వారా రిలీజ్‌ చేసింది. 

మరోవైపు ఏ జట్టుకు కూడా తమ సొంత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడే వెసులుబాటు లేకపోవడంతో.. ఆయా జట్లు తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడనున్నాయి. కోల్‌కతా తమ మ్యాచ్‌లను చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, ముంబై నగరాల్లో ఆడనుంది. కాగా, కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌, అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ కమలేష్‌ నాగర్‌కోటి, బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి తదితరులు ఆదివారం నుంచి ప్రారంభమైన క్వారంటైన్‌లో చేరారు. ఏప్రిల్‌ 11న కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు