షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్‌

19 Oct, 2020 08:43 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ అంటేనే వినోదాల విందు. అందులోనూ సూపర్‌ ఓవర్‌లో ఫలితం తేలడం అంటే ఉత్కంఠగా మ్యాచ్‌ సాగినట్టే. అభిమానులకు ఎగ్జయిట్‌మెంట్‌కు గురిచేసినట్టే. మరి సూపర్‌ ఓవర్‌ కూడా టై గా ముగిసి రెండో సూపర్‌ కూడా ఆడితే.. ఆ మజా మరింత ‘సూపర్‌’గా ఉంటుంది. పంజాబ్‌, ముంబై జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌ దీనికి వేదికైంది. ఐపీఎల్‌ చరిత్రలోనే మొదటిసారి సూపర్‌+సూపర్‌ మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లకు 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి పంజాబ్‌ జట్టు సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది.

తొలి సూపర్‌ ఓవర్‌లో సింగిల్‌ డిజిట్‌ పరుగులే నమోదయ్యాయి. జస్ప్రీత్‌ బుమ్రా చక్కని యార్కర్‌ స్పెల్‌తో పూరన్‌ (0), రాహుల్‌ (4) వికెట్లను కోల్పోయి పంజాబ్‌ను 5 పరుగులే చేయగలిగింది. ఇక ఆది నుంచి జోరు మీదున్న ముంబై జట్టు ఆరు పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుందనుకున్నారంతా. కానీ, మహ్మద్‌ షమీ యార్కర్ల దాడితో స్వల్ప లక్ష్యాన్ని ముంబై అందుకోలేకపోయింది. డికాక్‌ (3) వికెట్‌ కోల్పోయి ఐదు పరుగులే చేయడంతో సూపర్‌ ఓవర్‌ కూడా ‘టై’ అయింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్లు సమాలోచనలు జరిపి మరో సూపర్‌ ఓవర్‌ను ఆడించారు. ఈసారి తొలుత ముంబై హర్దిక్‌ పాండ్యా (1) వికెట్‌ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్‌... గేల్‌ (7) సిక్స్, మయాంక్‌ (8) 2 ఫోర్లతో ఇంకో రెండు బంతులుండగానే 15 పరుగులు చేసి గెలిచింది. 
(చదవండి: చెన్నై తదుపరి మ్యాచ్‌లకు బ్రేవో దూరం)

షమీపై రాహుల్‌ ప్రశంసలు
అద్భుతమైన బౌలింగ్‌తో తొలి సూపర్‌ ఓవర్‌లో ఆరు పరుగుల లక్ష్యాన్ని కాపాడిన మహ్మద్‌ షమీపై పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ప్రశంసలు కురిపించాడు. ముంబై నిర్దేశించిన సూపర్‌ ఓవర్‌ లక్ష్యాన్ని కాపాడుకోవాంటే ఆరు బంతులూ యార్కర్లు వేయాలని షమీ అనుకున్నానని తెలిపాడు. 6 బంతులూ యార్కర్లు వేద్దామనుకుంటున్నాడని షమీ చెప్పడం పట్ల తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ మీట్‌లో రాహుల్‌ చెప్పుకొచ్చాడు. షమీ నిర్ణయాన్ని కెప్టెన్‌గా తాను, మిగతా సీనియర్‌ ఆటగాళ్లు స్వాగతించామని అన్నాడు. తన ప్లాన్‌ని పక్కాగా అమలు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. ఇక తాజా విజయంతో తమకు రెండు పాయింట్లు జతకావడం పట్ల రాహుల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ మూడింట విజయం సాధించింది.
(చదవండి: ఉత్కం‘టై’లో... పంజాబ్‌ సూపర్‌ గెలుపు)

మరిన్ని వార్తలు