కోహ్లి దూరం: ఆ చాన్స్‌ కొట్టేస్తే లక్కీయే!

22 Nov, 2020 13:11 IST|Sakshi

సిడ్నీ: కరోనా లాక్‌డౌన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ లేక మొహం వాచిపోయిన క్రికెట్ అభిమానులను ఐపీఎల్‌ 2020 కొంత అలరించింది. అయితే, వేదిక యూఏఈలో కావడం, మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులకు అవకాశం లేకపోవడం అక్కడ మైనస్‌. ఈక్రమంలోనే మరో ఐదు రోజుల్లో ఆస్ట్రేలియా భారత్‌ మధ్య మొదలు కానున్న క్రికెట్‌ సమరంపై అటు క్రీడాకారులు, ఇటు అభిమానులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. సీటింగ్‌ కెపాసిటీలో సగం మంది అభిమానులను ఈ మ్యాచ్‌లకు అనుమతించడమే దీనికి కారణం.

ఇక విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఆసీస్‌ గడ్డపై 2018-19 బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫిని సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా మళ్లీ అదే మ్యాజిక్‌ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, తొలి టెస్టు అవగానే కోహ్లి భారత్‌కు తిరుగుపయనం కానుండటం కలవరపెట్టే విషయం. అనుష్క శర్మ డెలివరీ నేపథ్యంలో డిసెంబర్‌ 17న మొదలయ్యే తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి రానున్నాడు. 
(చదవండి: పుజారా,రహానేలు కీలకం)

మిగతా మూడు టెస్టులకు కోహ్లి దూరమవడం టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని ఆసీస్ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై భారత సెలక్టర్లకు పరీక్షగా మారిందని చెప్పాడు. కోహ్లి స్థానంలో యువ ఆటగాడికి అవకాశం కల్పిస్తే మాత్రం వారు అదృష్టవంతులని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫోతో మాట్లాడుతూ చాపెల్‌ పేర్కొన్నాడు. ఆసీస్‌ జట్టుకు కూడా వార్నర్‌తో పాటు ఓపెనింగ్‌కు దిగే జోడి సెలక్షన్‌ కష్టంగా మారిందని, యువ క్రికెటర్‌ పుకోవ్‌స్కీ దానికి సరిపోతాడని అనుకుంటున్నట్టు చాపెల్‌ తెలిపాడు. ఇక ఇరు దేశాల మధ్య జరగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగం. టెస్టు చాంపియన్‌ షిప్‌లో ప్రస్తుతం భారత్‌-ఆస్ట్రేలియాలు టాప్‌లో ఉన్నాయి.
(చదవండి: భారత్‌ వెళ్లేందుకు బోర్డు అవకాశం ఇచ్చినా...)

మరిన్ని వార్తలు