IND Vs ENG Test: రోహిత్‌ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్‌ కాదనుకుంటే రహానే?

26 Jun, 2022 11:45 IST|Sakshi

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలింది. భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీంతో వారం పాటు రోహిత్‌ ఐసోలేషన్‌లో ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే జూలై 1న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌కు రోహిత్‌ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్‌ దూరమైతే జట్టును నడిపించేది ఎవరనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. 

కోహ్లి లేదా పంత్‌.. కాదనుకుంటే రహానే?
వాస్తవానికి కెప్టెన్‌ దూరమైతే జట్టును వైస్‌ కెప్టెన్‌ నడిపించడం ఆనవాయితీ. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు రోహిత్‌ కెప్టెన్‌గా, కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే రాహుల్‌ గజ్జల్లో గాయంతో ఇంగ్లండ్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ కూడా ప్రత్యేకంగా వైస్‌ కెప్టెన్‌ ఎవరనేది వెల్లడించలేదు. అనుభవం దృష్యా కోహ్లి లేదా పంత్‌లలో ఎవరు ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంతకముందు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి నుంచే రోహిత్‌ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. 

గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సూపర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. 2-1తో ఆధిక్యంలో ఉన్న దశలో కరోనా వైరస్‌ కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. తాజా పర్యటనలో ఆ ఐదో టెస్టును ఏకైక టెస్టుగా మార్చి మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లికి మరోసారి అవకాశం ఉంది. అయితే కోహ్లి దీనికి అంగీకరిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. అలా కాకుండా పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే యోచనలోనూ బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియాను విజయవంతగా నడిపించాడు. అది టి20... అందునా యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సమస్య రాలేదు. కానీ ఇక్కడేమో టెస్టు జట్టు.. పైగా జట్టులో పంత్‌ కన్నా సీనియర్లు ఉండడంతో జట్టును సమర్థంగా నడిపించగలడా అనే సందేహాలు వస్తున్నాయి. వీరిద్దరు కాదనుకుంటే రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశము లేకపోలేదు. 

రోహిత్‌ శర్మకు నెగెటివ్‌ వస్తే..
తాజాగా రోహిత్‌ శర్మకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌ అని వచ్చింది. ర్యాపిడ్‌ టెస్టులో ఒక్కోసారి తప్పుడు రిపోర్ట్స్‌ వస్తుంటాయి. అందుకే రోహిత్‌ శర్మకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు కూడా నిర్వహించారు. దీని ఫలితం మరికొద్ది గంటల్లో రానుంది. ఒకవేళ నెగెటివ్‌ వస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇంగ్లండ్‌తో టెస్టుకు రోహిత్‌ సారధ్యం వహిస్తాడు. అలా కాకుండా పాజిటివ్‌ వస్తే మాత్రం వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుంది.

చదవండి: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. స్కోర్: 364/9

టీమిండియాకు భారీ షాక్‌.. రోహిత్‌ శర్మకు కరోనా పాజిటివ్‌..!

మరిన్ని వార్తలు