Rohit-Kohli: కోహ్లికి పోటీగా రోహిత్‌ కటౌట్‌.. తగ్గేదేలే అంటున్న అభిమానులు

28 Sep, 2022 18:01 IST|Sakshi

టీమిండియా ఆటగాళ్లు కోహ్లి, రోహిత్‌ శర్మలు మంచి మిత్రులుగా కనిపిస్తారు. మైదానంలోనే కాదు బయట కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అయితే ఈ ఇద్దరి ఆటగాళ్ల అభిమానులు మాత్రం ఎడమొహం, పెడమొహంలా ఉంటారు. సోషల్‌ మీడియా వేదికగా కోహ్లి, రోహిత్‌ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం గతంలో చాలాసార్లు చూశాం. కోహ్లి కెప్టెన్సీ కోల్పోవడానికి పరోక్షంగా రోహిత్‌ కారణమంటూ గతంలోనూ సోషల్‌ మీడియాలో ఏకిపారేశారు. ఏది ఏమైనా వీరిద్దరి ప్రస్తావన మరోసారి కటౌట్ల రూపంలో ప్రస్తావనకు వచ్చింది. 

బుధవారం టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య తిరువనంతపురం వేదికగా తొలి టి20 జరగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు మ్యాచ్‌ జరగనున్న గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియానికి వెళ్లే దారిలో దాదాపు 100 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు.దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లి కటౌట్ చూసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫాన్స్.. గంటల వ్యవధిలోనే హిట్‌మ్యాన్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

కోహ్లీ కటౌట్‌ను మించి రోహిత్ కటౌట్ పెట్టారు అతని అభిమానులు. రోహిత్ కటౌట్ 100 అడుగులకు పైనే ఉంటుంది. 'ఆల్ కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్' పేరిట రోహిత్ శర్మ కటౌట్ ఏర్పాటు చేశారు. హిట్‌మ్యాన్ కటౌట్‌ను కూడా గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలోనే ఏర్పాటు చేశారు. ఈ రెండు కటౌట్‌లు ప్రతిఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. టీమిండియా ఫాన్స్ అందరికీ ఈ కటౌట్‌లు కనుల పండగలా ఉన్నాయి. 

అయితే ఈ కటౌట్ల వ్యవహారం కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో గొడవకు దిగుతున్నారు. మా ఆటగాడి కటౌటే బాగుందంటూ కామెంట్స్ చేసుకున్నారు. 'విరాట్ కోహ్లీ కటౌట్ చూసి.. రోహిత్ శర్మ డబ్బులు పంపించాడా?' అని కొందరు కోహ్లి అభిమానులు ఎగతాళి చేశారు. మరోవైపు ' మా కటౌట్ చూసి విరాట్ కోహ్లి ఫ్యాన్స్ ఓర్వలేకపోతున్నారు' అని రోహిత్ ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కోహ్లి, రోహిత్ శర్మ కటౌట్‌లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

చదవండి: మరీ ఇంత బద్దకమా.. ఒక్క దానితో పోయేది!

Ind Vs Sa: కేరళలో రోహిత్‌ క్రేజ్‌ మామూలుగా లేదు! ఫొటో వైరల్‌

మరిన్ని వార్తలు