టాప్‌లో కొనసాగుతున్న కోహ్లి..

31 Mar, 2021 19:05 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీలతో(56, 66) అలరించిన ఛేజింగ్ కింగ్.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌.. 870 రేటింగ్‌ పాయింట్లు సాధించి నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో ర్యాంకులో కొనసాగుతుండగా.. వరుసగా హాఫ్‌ సెంచరీ, సెంచరీ బాదిన కేఎల్‌ రాహుల్‌ 31 స్థానం నుంచి 27వ స్థానానికి ఎగబాకాడు. ఆఖరి వన్డేలో సూపర్‌ ఫిఫ్టీ సాధించిన హార్దిక్‌ 42వ ర్యాంకు దక్కించుకోగా, వరుస అర్ధసెంచరీలతో చెలరేగిన రిషబ్‌ పంత్‌(77, 78) టాప్‌-100లో అడుగుపెట్టాడు.  

మరోవైపు బౌలింగ్‌ విభాగంలో టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి నాలుగో స్థానంలో నిలువగా, భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగేళ్ల తర్వాత బెస్ట్ ర్యాంక్(11వ ర్యాంక్‌) అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 7 వికెట్లు తీసిన పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 93 నుంచి 80వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అగ్రస్థానంలో, ఆఫ్ఘన్‌ బౌలర్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ రెండులో, న్యూజిలాండ్‌ మ్యాట్‌ హెన్రీ మూడో స్థానంలో నిలిచారు. 
చదవండి: సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్‌..లీగ్‌ నుంచి స్టార్‌ ఆటగాడు ఔట్‌

మరిన్ని వార్తలు