పీవీఎల్‌ చాంప్‌ కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌

28 Feb, 2022 05:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) టోర్నమెంట్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌ జట్టు చాంపియన్‌గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌ 3–0 (15–13, 15–10, 15–12)తో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ జట్టును ఓడించింది. కోల్‌కతా ఆటగాడు వినీత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవా ర్డును దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కీలకదశలో కోల్‌కతా ఆటగాళ్లు పాయింట్లు గెలిచి వరుస సెట్‌లలో విజయాన్ని అందుకున్నారు.

వినీత్‌ ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’ గా... ఎస్‌వీ గురుప్రశాంత్‌ (హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌) ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా... అంగముత్తు (అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌) ‘బెస్ట్‌ స్పైకర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా... జాన్‌ జోసెఫ్‌ (హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌) ‘బెస్ట్‌ బ్లాకర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా... షాన్‌ జాన్‌ (అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌) ‘ఫాంటసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌’గా అవార్డులు గెల్చుకున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు.

మరిన్ని వార్తలు