సింధు, శ్రీకాంత్‌ సులువుగా...

7 Apr, 2022 04:53 IST|Sakshi

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్స్‌

సన్‌చెయోన్‌: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్స్‌ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ సింధు 40 నిమిషాల్లో 21–15, 21–14తో లౌరెన్‌ లామ్‌ (అమెరికా)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 40 నిమిషాల్లో 22–20, 21–11తో డారెన్‌ లూ (మలేసియా)ను ఓడించాడు.

గతంలో డారెన్‌తో ఆడిన మూడుసార్లూ ఓడిన శ్రీకాంత్‌ నాలుగో ప్రయత్నంలో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. మహిళల సింగిల్స్‌ మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ 5–21, 13–21తో రెండో సీడ్‌ ఆన్‌ సెయంగ్‌ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ –చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–16, 21–15తో తె యాంగ్‌ షిన్‌–వాంగ్‌ చాన్‌ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జోడీ 21–19, 21–18తో జున్‌ లియాంగ్‌ ఆండీ క్వెక్‌–యుజియా జిన్‌ (సింగపూర్‌) జంటపై నెగ్గింది.  

మరిన్ని వార్తలు