ఆరు గంటల పాటు కృనాల్‌ విచారణ

14 Nov, 2020 05:04 IST|Sakshi

ముంబై: ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాను సుదీర్ఘ విచారణ అనంతరం కస్టమ్స్‌ అధికారులు విడిచిపెట్టారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌ దుబాయ్‌ నుంచి గురువారం ముంబై చేరుకున్నాడు. అతని వద్ద విలువైన వస్తువులు (ధ్రువపత్రాలు లేని), బంగా రం ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అడ్డగించారు. పరిమితికి మించి బంగారం, అత్యంత విలువైన నాలుగు లగ్జరీ వాచ్‌లు (ఒమెగా, అంబులర్‌ పిగెట్‌ బ్రాండ్లు)  దుబాయ్‌లో కొనుగోలు చేసినట్లు తెలిసింది.

భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. కోటి. ఈ విచారణ అర్ధరాత్రి దాకా సాగింది. నిబంధనలు తెలియకే ఇంతగా కొనుగోలు చేశానని, పన్నులతో పాటు జరిమానా కూడా కడతానని విచారణ సందర్భంగా అతను క్షమాపణలు చెప్పడంతో అధికారులు అతన్ని విడిచిపెట్టారు. అయితే అతను తెచ్చిన వస్తువుల్ని తిరిగివ్వలేదు. విలువైన బ్రాండ్లకు చెందిన వాచీలను కొనుగోలు చేసిన కృనాల్‌ దీనికి సంబంధించి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించలేదు. ఇప్పుడు వీటిపై 38 శాతం డ్యూటీ, అదనంగా జరిమానా చెల్లించాక... దర్యాప్తు మొత్తం పూర్తయ్యాకే వీటిని అతనికి అప్పగిస్తారు.

మరిన్ని వార్తలు