Ind Vs WI T20I: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..!

25 Jul, 2022 09:42 IST|Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత వెటరన్‌ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. దీంతో అతడు కరీబియన్‌ దీవులకు ఆదివారం పయనమయ్యాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా కుల్ధీప్‌ వెల్లడించాడు. త్వరలో కరేబియన్‌లో కలుద్దాం, నా సహచర ఆటగాళ్లతో చేరడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా అని ఇనస్టాగ్రామ్‌ ఖాతాలో కుల్దీప్‌ పేర్కొన్నాడు.

కాగా స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు కుల్దీప్‌ యాదవ్‌ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌, ఇంగ్లండ్‌ పర్యటనకు అతడు దూరమయ్యాడు. అనంతరం బెంగళూరులోని నేషనల్‌  క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందిన యాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. ఈ క్రమంలో విండీస్‌తో వన్డే సిరీస్‌కు కాకుండా టీ20 సిరీస్‌కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీ20 సిరీస్‌కు ముందు కుల్దీప్‌ తన ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది అని జట్టు ఎంపిక సమయంలో సెలక్షన్‌ కమిటీ పేర్కొంది.

ఇక తాజాగా కుల్ధీప్‌ యాదవ్‌ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. "ఆదివారం( జులై 24) కుల్ధీప్‌కు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాం. అందులో అతడు ఉత్తీర్ణత సాధించాడు. కాబట్టి అతడు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ నుంచి నేరుగా ట్రినిడాడ్‌కి పయనమయ్యాడు" అని బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. ఇక వన్డే సిరీస్‌ అనంతరం ఐదు టీ20ల్లో విండీస్‌తో భారత్‌ తలపడనుంది.
చదవండి: IND vs WI: వన్డేల్లో వెస్టిండీస్‌ ఓపెనర్‌ అరుదైన ఫీట్‌.. నాలుగో ఆటగాడిగా..!

మరిన్ని వార్తలు