‘ఐపీఎల్‌ చేదు జ్ఞాపకాలను మరిచిపోయాడు’ 

12 Sep, 2020 08:49 IST|Sakshi

కుల్దీప్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది

కేకేఆర్‌ మెంటార్‌ డేవిడ్‌ హస్సీ వ్యాఖ్య

కోల్‌కతా: గతేడాది జరిగిన ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశ పరిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు ఆ జట్టు మెంటార్‌ డేవిడ్‌ హస్సీ పేర్కొన్నాడు. 2019 ఐపీఎల్‌ తాలూకు చేదు జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయి... త్వరలో ఆరంభమయ్యే సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు కుల్దీప్‌ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని హస్సీ తెలిపాడు. ‘కుల్దీప్‌ యాదవ్‌ను గత తొమ్మిది రోజులుగా ప్రాక్టీస్‌ సెషన్‌లో చూస్తున్నా. అతడు చాలా చురుగ్గా ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. రెండు వైపులా బంతిని టర్న్‌ చేయగలుగుతున్నాడు. ఫీల్డింగ్‌లో కూడా మెరుగయ్యాడు’ అని హస్సీ వ్యాఖ్యానించాడు.

2019 ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ తరఫున  9 మ్యాచ్‌ల్లో ఆడిన కుల్దీప్‌... 4 వికెట్లు మాత్రమే తీశాడు. 8.66 ఎకానమీ రేటుతో పరుగులను ధారాళంగా సమర్పించుకోవడంతో... జట్టు సారథి దినేశ్‌ కార్తీక్‌ అతడిని తుది జట్టునుంచి తప్పించాడు. ముఖ్యంగా ఆ ఏడాది బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కుల్దీప్‌ కంటతడి కూడా పెట్టాడు. కుల్దీప్‌ వేసిన 16వ ఓవర్‌లో బెంగళూరు ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ రెండు ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. ఆ ఓవర్‌లో 27 పరుగులు ఇవ్వడంతో... ఓవర్‌ ముగిసిన తర్వాత కుల్దీప్‌ మైదానంలో కూర్చోని బోరున విలపించాడు. 
(చదవండి: తన బ్యాట్‌లను రిపేర్‌ చేస్తున్న కోహ్లి..)

మరిన్ని వార్తలు